మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి ద్వారా సేవలు అందించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవాలని, వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, అద్దాలు ఇప్పించే బాధ్యత తనదేనని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారికి ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకు చెందిన పేద ప్రజలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సిద్దిపేటలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆర్థికంగా స్తోమత ఉన్నవారు డబ్బులు చెల్లించవచ్చని, కానీ పేదలకు మాత్రం ఎలాంటి భారం లేకుండా చికిత్స అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్కు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలెందరో మన మధ్య ఉన్నారని, అలాంటి వారికి ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ఈ కేంద్రం ప్రారంభించిన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇప్పటికే అనేక మందికి ఉచితంగా కంటి చికిత్సలు, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా మోటార్ బైక్, బస్సు డ్రైవర్లు, మెకానిక్లు, ఎలక్ట్రీషియన్లు వంటి వృత్తుల వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత చాలామందికి కంటి సమస్యలు వస్తుంటాయని, కానీ చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తుంటారని, అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.




