ఆర్థిక సహాయం అందితే అద్భుతాలు సృష్టించగల ప్రతిభావంతులు మన చుట్టూ ఎందరో ఉంటారు. అలాంటి ఒక నిరుపేద విద్యార్థి డాక్టర్ రమేష్ కలని నిజం చేసి, సమాజానికి ఒక మంచి వైద్యుడిని అందించారు శ్రీ ఎస్ పీ ఆర్ (SPR) ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ శ్రీ సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు.
రమేష్ అనే విద్యార్థిది అత్యంత నిరుపేద కుటుంబం. చదువులో ఎంతో చురుకైన రమేష్కు ఎంబీబీఎస్ (MBBS) చదవాలనేది బలమైన కోరిక. అయితే, చదువుకు అయ్యే భారీ ఖర్చును భరించలేక, తన ఆశను వదులుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీఆర్ ట్రస్ట్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు వెంటనే స్పందించారు. రమేష్ పరిస్థితిని అర్థం చేసుకుని, ట్రస్టు ద్వారా అతడిని దత్తత తీసుకున్నారు.
గడిచిన ఐదు సంవత్సరాల పాటు దాదాపు ఐదు లక్షల రూపాయల ఖర్చును తానే భరిస్తూ, రమేష్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య విద్యను అభ్యసించేలా పున్నారెడ్డి గారు పూర్తి అండగా నిలిచారు. రమేష్ కూడా పట్టుదలగా చదివి, ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి విజయవంతంగా డాక్టర్ పట్టా అందుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రమేష్, పున్నారెడ్డి గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఈ సందర్భంగా రమేష్ భావోద్వేగంతో మాట్లాడుతూ.. “నా కష్టకాలంలో దేవుడిలా అండగా నిలిచి నా కలని నిజం చేసిన పున్నారెడ్డి గారికి రుణపడి ఉంటాను. నాలాగే చదువుకోవాలనే ఆశ ఉండి, ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు నా వంతు సహాయం అందిస్తాను. భవిష్యత్తులో నాకు వచ్చే ప్రతి నెల వేతనంలో కొంత భాగాన్ని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల చదువుల కోసం కేటాయిస్తాను” అని ప్రతిజ్ఞ చేశారు.
ఒక గొప్ప ఆశయంతో తనను చదివించిన దాతకు, సమాజ సేవ రూపంలో తన కృతజ్ఞతను తిరిగి చెల్లిస్తానంటున్న విద్యార్థి రమేష్పై ఇప్పుడు సర్వత్రా అభినందనల జల్లు కురుస్తోంది.



