ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ, రాష్ట్ర భవిష్యత్తుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నటి, కాంగ్రెస్ నాయకురాలు పూనమ్ కౌర్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె మంత్రి నారా లోకేష్ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో యువత సంఖ్య తగ్గిపోతోందని, వృద్ధుల జనాభా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం దంపతులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన ఒక నెటిజన్ చేసిన పోస్ట్కు పూనమ్ కౌర్ రిప్లై ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“చంద్రబాబు గారు చెప్పిన ఈ పాలసీని ముందుగా ఆయన సొంత ఇల్లు.. అంటే మంత్రి నారా లోకేష్ నుంచే మొదలుపెట్టాలి” అని ఆమె సూచించారు.
ఒకరి వ్యక్తిగత విషయాలను లేదా విధానాలను విమర్శించడం వేరని, కానీ పాలసీల పరంగా మాట్లాడినప్పుడు అది అందరికీ వర్తించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
తన పాఠశాల రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారు తనకు పెద్ద స్ఫూర్తి అని పూనమ్ కౌర్ గుర్తుచేసుకున్నారు. స్కూల్లో తనకు మొదటి గోల్డ్ మెడల్ అందించింది కూడా చంద్రబాబు గారేనని చెప్పారు.
అంతటి గొప్ప వ్యక్తి, విజనరీ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించిందని పేర్కొన్నారు. అభిమానించడం వేరు, ఒక ప్రభుత్వ విధానాన్ని లేదా ఆలోచనను తప్పుపట్టడం వేరని స్పష్టం చేస్తూ.. పాలసీ పరంగా తాను ఈ వ్యాఖ్యలను విభేదిస్తున్నట్లు ఆమె తేల్చి చెప్పారు.
ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు మరియు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.




